Air India Plane Crash: ఘోర ప్రమాదం.. అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం

Air India Plane Crash: ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. AI171 విమానం 242 మంది ప్రయాణికులతో ఉండగా, విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది.
మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగింది. విమానం తక్కువ ఎగురుతూ ఎత్తుకు చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్న వీడియోలో, మధ్యాహ్నం 1.38 గంటలకు విమానం నేలను ఢీకొట్టి పేలిపోయింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే తక్కువ హైట్లో ఎగురుతుండటంతో ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం అకస్మాత్తుగా 825 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందకు పడిపోయింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్కు సేవలందిస్తున్న ఫ్లైట్ AI171, ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. సైట్ నుండి విజువల్స్ చూస్తే దట్టమైన బూడిద పొగ ఎగసిపడుతున్నట్లు కనిపించింది. రెండు డజన్లకు పైగా అంబులెన్స్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన అనేక మంది ప్రయాణికులను ఇప్పటికే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో వైద్య, అగ్నిమాపక బృందాలు పనిచేస్తున్నాయి. అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా విమానాశ్రయం, చుట్టుపక్కల ప్రమాద ప్రాంతానికి దారితీసే యాక్సెస్ మార్గాలను అధికారులు మూసివేసారు. సంఘటన స్థలం చుట్టూ రద్దీని నియంత్రించడానికి ట్రాఫిక్ మల్లించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. సంఘటన జరిగిన వెంటనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం గురించి తెలిసి షాక్ అయ్యానని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అత్యంత అప్రమత్తంగా పరిస్థితిని పరిశీలిస్తున్నాన్నారు. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానన్నారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వైద్య సహాయాన్ని బాధితులకు అందిస్తున్నామన్నారు.
అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరేటప్పుడు కూలిపోయిన AI171 విమానం సాయంత్రం 6:25 గంటలకు లండన్ గాట్విక్లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఎయిర్ ఇండియా యాజమాన్యంలోని టాటా గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, అహ్మదాబాద్ లండన్ గాట్విక్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఈరోజు విషాదకరమైన ప్రమాదంలో చిక్కుకుందని చెప్పడానికి చింతిస్తున్నానన్నారు. ఘటనలో ప్రభావితమైన వారందరి కుటుంబాలుకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. విమానంలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎవరెవరున్నారన్నదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.