Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

Nawaz Sharif: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాధారణంగా దేశ ప్రధానిగా పనిచేసిన వారు ప్రాంతీయ పదవులపై ఆసక్తి చూపరు. కానీ నవాజ్ షరీఫ్ మాత్రం ఏకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్కు ప్రధాని కావాలని ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముజఫరాబాద్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన పీఓకేలో తమ పార్టీ గెలిస్తే, తన సోదరుడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కోరి మరీ పీఓకే ప్రధాని బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. పీఓకే అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తమ పూర్వీకులు కశ్మీర్ నుంచే వచ్చారని చెప్పుకొచ్చారు.
అయితే నవాజ్ షరీఫ్ ప్రకటన వెనుక పెద్ద రాజకీయం దాగి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పీఓకేలో ఆకాశాన్నంటిన ధరలు, విపరీతమైన విద్యుత్ ఛార్జీలు, వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా జనం రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ప్రజల నిరసనలు, పోలీసుల ఘర్షణల్లో ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల వేళ అక్కడి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకే నవాజ్ షరీఫ్ ఈ కొత్త నాటకానికి తెరతీశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు, పీఓకే పరిణామాలపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో విడదీయరాని అంతర్భాగాలేనని స్పష్టం చేసింది. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న పీఓకేలో నిర్వహించే ఎలాంటి ఎన్నికలను లేదా తాత్కాలిక అసెంబ్లీలను భారత్ ఏమాత్రం గుర్తించదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.



