దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్-19 కేసులు

దేశంలో కొవిడ్-19 కేసులు మరోసారి నెమ్మదిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వచ్చే సాధారణ జ్వరాలు, ఫ్లూగా భావించి చాలా మంది కోవిడ్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని.. దీనివల్ల వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ చిన్న అనుమానాస్పద లక్షణం కనిపించినా స్వీయ వైద్యం చేసుకోకుండా, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం నమోదవుతున్న కేసులలో ప్రధానంగా జ్వరం, నిరంతరాయంగా వచ్చే పొడి దగ్గు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటితో పాటు విపరీతమైన అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఐసోలేషన్లో ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పండుగలు, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడకం, భౌతిక దూరం వంటి ముందస్తు జాగ్రత్తలను మళ్లీ అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు పునరుద్ఘాటిస్తున్నారు.



