Harish Rao : ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం

Harish Rao: పీసీ ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయసూత్రాలను విస్మరిస్తూ చేసిన విచారణను.. ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని కోర్టు చెప్పిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చినట్లు తెలిపారు.
హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బయటపడ్డాయన్నారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందన్నారు. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరమని హరీష్ రావు అన్నారు.



