తిరుమల దర్శనం పేరుతో లక్షల రూపాయల మోసం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో భక్తులను టార్గెట్ చేస్తూ వరుస మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన 74 ఏళ్ల జైపాల్ రెడ్డిని తిరుపతికి చెందిన మహిళ జింకల పల్లవి రెడ్డి మోసం చేసిన ఘటన తాజాగా బయటపడింది. తోమాల, అభిషేకం, శ్రీవాణి దర్శనం, వస్త్రం సేవ టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి 4 లక్షల 34 వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మరో ఘటనలో 60 మంది భక్తులకు భారీ షాక్ తగిలింది.
సుప్రభాత సేవ దర్శనం టికెట్లు, తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తానంటూ గుంటూరు జిల్లాకు చెందిన భక్తుల నుంచి నిమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి 4 లక్షల 22 వేల రూపాయలు వసూలు చేశాడు. టీటీడీ ఉద్యోగులతో తనకు పరిచయాలు ఉన్నాయని, ఎంప్లాయీస్ కోటా ద్వారా టికెట్లు ఏర్పాటు చేస్తానని నమ్మించాడు. అయితే దర్శనం రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది.
అతను ఇచ్చిన సిఫారసు లేఖలు నకిలీవని టీటీడీ అధికారులు తేల్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్శనం టికెట్లు, ప్రత్యేక సేవలు, వసతి గదుల పేరుతో దళారులు, ఫేక్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని పోలీసులు భక్తులకు హెచ్చరిస్తున్నారు. టీటీడీ అధికారిక మార్గాల ద్వారానే సేవలను పొందాలని సూచిస్తున్నారు.



