తెలంగాణ
పద్మశ్రీ మొగిలయ్యకు భూమి పట్టా సమస్యపై ఆవేదన

రంగారెడ్డి జిల్లాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగిలయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన భూమికి ఇప్పటికీ పట్టా లభించకపోవడంతో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తుర్కయాంజల్ పరిధిలోని కుంట్లూరులో 600 గజాల నివాస స్థలం కేటాయించినప్పటికీ, కోర్టు కేసుల కారణంగా గత రెండేళ్లుగా సమస్య కొనసాగుతోందని మొగిలయ్య తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ, హయత్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా పరిష్కారం దొరకలేదని చెప్పారు. తన జీవితాంతం సేవలకే అవార్డులు వచ్చాయని, కానీ కుటుంబంలోనే అవమానాలు ఎదురవుతున్నాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమికి పట్టా మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



