Himachal Pradesh: వరదలకు కొట్టుకుపోయిన బ్రిడ్జి.. జిప్ లైన్ తో భక్తులను కాపాడిన సైన్యం

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కిర్ జిన్నౌల్లాలో వరదలకు ఓ బ్రిడ్జి కొట్టకుపోయింది. దీంతో కిన్నౌర్ కైలాష్ మార్గంలో 413 మంది భక్తులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది యాత్రికులు అందరినీ కాపాడారు. జిప్ లైన్ మార్గం ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని నది దాటించారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
హరిద్వార్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమట్టం పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంకోవైపు, ఉత్తరాఖండ్ లోని ఖీర్ గంగానది పరివాహకప్రాంతంలో నిన్న జలప్రవాహం విరుచుకుపడటంతో సగం గ్రామం కొట్టుకుపోయింది. మరోవైపు, ఉత్తరాఖండ్ లోని హర్ కి పౌరి-భీమ్ గోడా రహదారిపై కొండపై నుంచి బండ రాళ్లు అకస్మాత్తుగా పడ్డాయి. ఈ సమయంలో అక్కడ బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



