Ram Gopal Varma: మరో వివాదంలో డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma: తన వ్యాఖ్యలు, చేష్టలతో తరచూ వార్తల్లో కనిపించే వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్యకర పోస్ట్ల కేసులో ఇటీవలే ఆరోపణలు ఎదుర్కొన్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆర్జీవీపై పీఎస్లో ఫిర్యాదు చేశారు.
డైరెక్టర్ రామ్గోపాల్ వర్మపై తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో మేడా శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. రామ్గోపాల్ వర్మ.. భారత ఆర్మీని చులకన చేసి మాట్లాడారని, మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల మధ్య సొంత లాభాపేక్షతో ప్రాంతీయ విబేధాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. దీంతో ఆర్జీవీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై ఆధారాలను సేకరిస్తున్నారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అసభ్యకర పోస్ట్లు చేశారని ఆయనపై గతంలో కేసులు నమోదు అయ్యాయి. వీటితో పాటు కులాల మధ్య చిచ్చుపెట్టేలా సినిమాలు చిత్రీకరించారని.. చంద్రబాబు, లోకేశ్పై వ్యంగ్యంగా సీన్లు చేశారని కేసులు నమోదు అయ్యాయి. అయితే కొన్ని కేసుల్లో ఇటీవలే రాంగోపాల్ వర్మకు ఊరట లభించింది. మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ కూడా వచ్చింది.