Chandrababu: ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

Chandrababu: కడప జిల్లాలో టీడీపీకి ఎదురుగాలి వీస్తోందా..? ఎంత చేసినా జనంలో రెస్పాన్స్ రావడం లేదా..? సైకిల్ సర్వేలో ఇదే విషయం తేటతెల్లమైందా..? ఏపీలో కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తి కావడంతో.. ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి పెట్టారు పసుపు దళపతి. అన్ని విషయాల్లో తొలి నుంచి తాను నమ్ముకున్న ప్రజా సర్వేను ఇంటర్నల్గా నిర్వహించారు.
నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఫలితాలను తెప్పించుకున్నారు. నెగ్గిన వారికి ప్రశంసలు తగ్గిన వారికి క్లాసులు పీకుతున్నారట సీఎం సార్. వచ్చే ఎన్నికల నాటికి ప్రజలతో మమేకమవ్వాలని కాసింత గట్టిగానే హెచ్చరికలు జారీచేస్తున్నారట. ఉమ్మడి కడప జిల్లాలో నిర్వహించిన ప్రజా సర్వేలో నెగ్గిన వారెవరు తగ్గిన వారెవరు.. వాచ్ దిస్ స్టోరీ…
అధికారంతో విర్రవీగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి పాలనకు ఏడాది ముగిసింది. ఈ మధ్యకాలంలో పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందనే అంశాలపై దృష్టి పెట్టారు ఏపీ సీఎం చంద్రబాబు. మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మరింతగా పట్టు సాధించే క్రమంలో కార్యాచరణను రూపొందించుకుంటోంది సైకిల్ సైన్యం.
ఆంతే కాకుండా వైఎస్ మార్క్ రాజకీయానికి ఆలవాలంగా నిలిచిన కడప జిల్లాపై కూడా టీడీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఉమ్మడి కడప జిల్లాలో పదింట అయిదు స్థానాలను ఒక్క టీడీపీనే కైవసం చేసుకుంది. ఈ ఐదు స్థానాలపై పసుపు పార్టీ అంతర్గత సర్వేలను నిర్వహించింది. అక్కడి ఎమ్మెల్యేల పనితీరుపై జనాభిప్రాయాన్ని సేకరించింది. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసుకున్న సర్వేల రీతిలోనే ఈ సర్వేలను టీడీపీ జరిపినట్టు సమాచారం.
ముఖ్యంగా కడప జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వీరికి సర్వేలో తక్కువ మార్కులు వచ్చాయట. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే స్థానికుల నుంచి తీవ్రమైన అసంతృప్తిని మూటగట్టుకోవడం ఏమిటని ఆ నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రశ్నించారట. వచ్చే నాలుగేళ్లలో పద్ధతులు మార్చుకోవాలని గట్టిగానే చెప్పినట్టు పార్టీ వర్గాలంటున్నాయి.
వీరిలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఉన్నారట. పార్టీ నిర్వహించిన సర్వేలో ఈ నలుగురికి 20 నుంచి 30 శాతం లోపు మార్కులు పడ్డాయట. కనీసం నలభై శాతానికైనా వీళ్ల పనితీరు లేకపోవడంపై చంద్రబాబు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారట.
కడప జిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి మొత్తం ఏడు సీట్లను కూటమి కైవసం చేసుకుంది. ఇప్పటికే మిగిలిన పులివెందుల, బద్వేలు, రాజంపేట స్థానాలపై యువనేత లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ కూడా జరుగుతోంది. అభివృద్ధి, సంక్షేమంతో పాటు సూపర్ సిక్స్ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. మిగిలిన నాలుగేళ్లు నియోజకవర్గాల్లో ఉంటూ స్థానికులకు అందుబాటులో ఉండాలని ఆయా ఎమ్మెల్యేలకు ఉద్భోద చేశారట చంద్రబాబు.
అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని భారీగానే క్లాస్ పీకారట వెనుకబడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు. సంవత్సరంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంపై సీరియస్ అయ్యారట. ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనని తేల్చి చెప్పారట. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారట. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతు కూడట్టాలని హితబోధ చేశారట చంద్రబాబు.
ఉమ్మడి కడప జిల్లాలోని ఈ నలుగురు ఎమ్మెల్యేలది ఎవరికి వారిది ప్రత్యేక మైన శైలి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి ఆరోసారి శాసనసభ్యత్వాన్ని స్వీకరించిన సీనియర్మోస్ట్ నేత. అలాగే కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవీరెడ్డి వాడి, వేడి విమర్శలతో అనతి కాలంలోనే కడప రెడ్డెమ్మగా పేరొందారు. ఇక మైదుకూరు శాసన సభ్యుడిగా తొలిసారి ఎన్నికైన పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీకి విధేయులుగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నేతలతో వియ్యమొందిన ఈయన గతంలో టీటీడీ చైర్మన్గా కూడా పనిచేశారు.
కమలాపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పుత్తా చైతన్య రెడ్డి ఉన్నత విద్యావంతుడు. ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్సీ కూడా ఏళ్ల తరబడి కమలాపురం నుంచి టీడీపీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడు కూడా ఇలా ఈ నలుగురు ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైన రాజకీయ నేపథ్యం ఉంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటే మెరుగైన ఫలితాలను సాధించుకునే అవకాశాలు లేకపోలేదు.
మొత్తానికి కడప జిల్లాలోని సర్వేలో వెనుకబడిన ఆ నలుగురు ఆ ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ పీకారట. మరి చంద్రబాబు మాటలను ఈ నలుగురు నేతలు చెవికెక్కించుకుంటారా లేక పెడచెవిన పెట్టి వాళ్లనుకున్న మార్గంలోనే వెళ్తారా అనేది వేచి చూడాలి.