యమునా నది ఉగ్రరూపం

యమునా నది ఉగ్రరూపం దాల్చింది. దేశ రాజధాని దిల్లీలో నది నీటి మట్టం 207.41 మీటర్లకు చేరుకుంది. 1978, 2023 తర్వాత నీటిమట్టం ఈ స్థాయికి చేరుకోవడం చరిత్రలో ఇది మూడోసారి. భారీ జలప్రవాహంతో యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, మయూర్ విహార్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటివరకు 14 వేల మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 38 ప్రాంతాల్లో వరద శిబిరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎగువన ఉన్న వజీరాబాద్, హథినీకుండ్ బ్యారేజీల నుంచి పెద్దమొత్తంలో వరదను విడుదల చేస్తుండటంతో ఢిల్లీలో యమునా నది నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ దిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన, అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటిక కార్యకలాపాలు నిలిపివేశారు.



