బెంగాల్లో దీదీ మళ్లీ గెలుస్తుందా?

Mamata Banerjee: 2026 మార్చి ఏప్రిల్లో జరుగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై అధికార ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని గద్దె దించుతామని కేంద్రహోంమంత్రి అమిత్షా ప్రతిజ్ఞ తీసుకున్నారు. బెంగాల్లో మూడు రోజులు మకాం వేసిన షా మున్ముందు ప్రధానమంత్రి నరేంద్రమోడీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి బెంగాల్ ఎన్నికలు అన్నీ హిందూ ముస్లిం దేవుళ్ల చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా తన వైపు తిప్పుకున్న మమత ఈసారి స్ట్రాటజీ మార్చి జై దుర్గామాతా అంటున్నారు. బెంగాల్ సెంటిమెంట్ దుర్గామాత విగ్రహాన్ని కలకత్తాలో నిర్మించేందుకు సిద్దమయ్యారు. మరోవైపు టీఎంసీ పార్టీ నుంచి బహిష్కృతుడైన మైనార్టీ నేత హుమాయాన్ కబీర్ సీఎం మమతకు సవాల్ విసురుతున్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీతో కలిసి కబీర్ మైనార్టీ ఓట్లను చీల్చే ప్రయత్నంలో ఉన్నారు. బాబ్రీ మసీద్ ఇష్యూను తెరపైకి తీసుకొచ్చిన కబీర్ ఏకంగా ముజఫరాబాద్లో మసీద్ నిర్మాణానికి మైనారిటీలను ఏకతాటిపైకి తీసుకొస్తున్నారు. హిందూ ఓటర్లపై గురిపెట్టిన బీజేపీ తన జై శ్రీరాం మంత్రానికి పదును పెట్టింది.
బెంగాల్ ఎన్నికలపై కీలకంగా ప్రభావితం చూపించే అంశాల్లో బంగ్లాదేశ్ అల్లర్ల ప్రభావం కూడా ఉండనుందని విశ్లేషకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులను బీజేపీ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. ఓటర్ల సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ను తీసుకొచ్చిందే ముస్లిం మైనార్టీ ఓటర్లను తొలగించేందుకని మమత బెనర్జీ గగ్గోలు పెడుతోంది. దేశంలోని వివిద ప్రాంతాల్లో నివసిస్తున్న బెంగాళీలను బంగ్లాదేశీయులు అనుకుని దాడులు జరుగుతుండటం కూడా వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రభావితం చూపించే అంశం కావొచ్చు. ఇక్కడ హిందువుల్లోని మెజార్టీ ఓటు బ్యాంకును బీజేపీ చేజిక్కించుకుంటే కమల వికాసం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.
మరోవైపు సంప్రదాయ మేధావి వర్గంగా గుర్తింపుపొందిన సంప్రదాయ బెంగాళీలు, మైనార్టీలు మమత వైపు నిలిస్తే మళ్లీ టీఎంసీ గెలుపు ఖాయమనే టాక్ వస్తోంది. ఎటొచ్చీ మైనార్టీ ఓట్లను ఎంతమేరకు కబీర్-అసద్ జోడీ చీల్చే అవకాశం ఉంది, హిందూ ఓట్ల పోలరైజేషన్ బీజేపీకి మళ్లే ఛాన్స్ ఉందనే అంశంపైనే బెంగాల్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ఎనలిస్టులు అంటున్నారు.



