Phone Tapping Case: హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు

Phone Tapping Case: ఫోన్ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు.. టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్ తనను చిత్రహింసలు పెట్టారన్నారు. హరీశ్రావుతోపాటు ఈ కేసులో మరో నిందితునిగా ఉన్న మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని బెదిరించారని 14వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో అఫిడవిట్ దాఖలుచేశారు.
హైకోర్టు ఆదేశానుసారం ఈ నెల 15న విచారణ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైనట్లు అఫిడవిట్లో తెలిపారు వంశీకృష్ణ. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్ చిత్రహింసలు పెట్టారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్రావు, మచ్చ వేణుగోపాల్కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈ రోజు రాత్రిలోపు లేకుండా చేస్తాం అని బెదిరించారని అఫిడవిట్లో పేర్కొన్నారు. చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న వంశీకృష్ణ స్వదస్తూరితో రాసిన అఫిడవిట్ను లాయర్ లక్ష్మణ్ నిన్న నాంపల్లి కోర్టుకు సమర్పించారు.
పంజాగుట్ట పోలీసులు తనను చంచల్గూడ జైలుకు తరలించిన తర్వాతగానీ ఆ కేసు పూర్వాపరాలు తనకు తెలియలేదని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు. వాస్తవానికి తాను పోలీసుల ముందు ఏమీ చెప్పలేదన్నారు. ఈ కేసులో ఏముందో అసలు పోలీసులు తనకు చదివి వినిపించలేదని తెలిపారు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా వినిపించుకోలేదని పొద్దున నుంచి సాయంత్రం వరకు అన్నం పెట్టలేదని సంచలన ఆరోపణలు చేశారు.
ఏసీపీ మోహన్కుమార్, ఎస్సై శివశంకర్ తనను కుటుంబంతో ఉన్నానని కూడా చూడకుండా అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. తన పిల్లలతో సహా తన భార్యను అర్దరాత్రి ఒకటిన్నర వరకు పీఎస్లో ఉంచారని వంశీకృష్ణ తన అఫిడవిట్లో వివరించారు.
వంశీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్పై తగు నిర్ణయం తీసుకుని ఏసీపీ, డీసీపీలపై కేసు నమోదు చేయనున్నట్టు లాయర్ కిరణ్కుమార్ తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసుస్టేషన్కు వెళ్లిన వంశీకృష్ణను చిత్రహింసలకు గురిచేయడం చట్టవ్యతిరేకమని అన్నారు.