Vivek Ramaswamy: డోజ్ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి

Vivek Ramaswamy: ఇండో అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి.. డోజ్ బాధ్యతల నుంచి వైదొలుగుతూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే.. రామస్వామి ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. అతని రాజీనామాకు ప్రధాన కారణం ఏమైవుంటుందో అన్న చర్చ జోరుగా జరుగుతోంది. భారత్ కోసమే రామస్వామి రాజీనామా చేశారా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఎలన్ మాస్క్తో గొడవలకు గల కారణాలేంటనే దానిపై చర్చ జరుగుతోంది.
డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ బాధ్యతల నుంచి.. వివేక్ రామస్వామి వైదొలిగారు. గవర్నర్గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. వివేక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒహైయో గవర్నర్ ఎన్నికలు నవంబర్ 2026లో జరగనున్నాయి. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున.. అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కోసం.. రామస్వామి ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.
రామస్వామి వైదొలగడానికి సంబంధించి.. పొలిటికో అనే పత్రిక ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. డోజ్లో తనతో పాటు సంయుక్త సారథిగా.. వివేక్ రామస్వామి ఉండటంపై.. మస్క్ అభ్యంతరం వ్యక్తం చేశారని.. షాకింగ్ అంశం లేవనెత్తింది. దీంతో.. అసలు ఏమి జరిగింది..? ఎందుకు మస్క్ అలాంటి ఆలోచన చేశారు..? అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి.. డొనాల్డ్ ట్రంప్ 2.0లో మస్క్ పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు ట్రంప్ తర్వాత ట్రంప్ అంతటి వారు ఎలాన్ మస్క్ అని చెప్పినా అతిశయోక్తి కాదు. అంతటి పవర్ ఉన్న మస్క్… డోజ్కు తనతో పాటు సంయుక్త సారథిగా వివేక్ రామస్వామి వంటి అమెరికన్ – ఇండియన్ వద్దు అని చెప్పారని.. ఫైనల్ అదే జరిగిందని ఆ పత్రిక పేర్కొంది.
డిసెంబర్ 26న వివేక్ రామస్వామి ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. అమెరికన్ కంపెనీలు విదేశీ ఇంజినీర్లను ఎంపిక చేసుకుంటున్నాయంటే.. దానర్థం అమెరికన్ ప్రజలకు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయని కాదు.. అందుకు కారణం “సీ” అనే అక్షరం.. ఇక్కడ “సీ” అంటే కల్చర్ అని అర్ధమని రామస్వామి చెప్పారు. ఇదే సమయంలో.. అమెరికా సమాజంలో చదువుకు, ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరని అన్నారు. విదేశాల నుంచి అమెరికా వచ్చి స్థిరపడిన తల్లితండ్రులు.. అమెరికాలోని స్థానిక తల్లితండ్రులు తమ తమ పిల్లల చదువులకు ఇచ్చే ప్రాధాన్యతలో చాలా తేడా ఉంటుందని వివరించారు. ఈ సమయంలో మనం మేల్కొనపోతే చైనా అధిక్యం చూపిస్తుందని చెప్పారు.
ట్వీట్లో రామస్వామి వ్యక్తం చేసిన అభిప్రాయాలు.. ఎలాన్ మస్క్ అండ్ కో కి నచ్చలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్స్లో ఓ వర్గం వివేక్ రామస్వామిపై గుర్రుగా ఉన్నారని చెబుుతున్నారు. పైగా.. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం. అది చదువులో అయినా, ఉద్యోగాల్లో అయినా అనేది ట్రంప్ ఉద్దేశం. ప్రధానంగా అమెరికాలో ఇటీవల నిరుద్యోగం రేటు పెరగడానికి విదేశీ ఉద్యోగుల తాకిడే కారణం అని చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో రామస్వామి ఈ కామెంట్లు చేయడంతో.. విషయం మరింత తీవ్రమైందని పొలిటికో పత్రిక తన కథనంలో తెలిపింది.