గుండెపోటుతో బాడీబిల్డర్ మృతి

ప్రముఖ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. కర్ణాటక రాష్ట్రం రావణగెరెకు చెందిన సుశీల్ బాడీ బిల్డింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు. కాగా జిమ్ నుండి ఇంటికి వచ్చిన అనంతరం సుశీల్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అతడు కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు గుర్తించారు. బీపీ పడిపోవడం వల్ల సుశీల్ గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు.
అంతర్జాతీయస్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలకు సిద్ధం అవుతున్న సమయంలో సుశీల్ గుండెపోటుతో మరణించడం అటు కుటుంబంలో, ఇటు స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఇదిలా ఉంటే జిమ్ చేస్తూ కుప్పకూలి మరణించిన ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాడీబిల్డర్ లు సైతం గుండెపోటుతో మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి మరణాలకు అధికవ్యాయామం, స్టెరాయిడ్స్ తీసుకోవడం, సరైన జాగ్రత్తలు పాటించకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు.



