News
పెరూలో భారీ భూకంపం.. ఐదుగురు మృతి

పెరూలో భారీ భూకంపం సంభవించింది. పెరూలోని ఆండిస్ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హువాంకాయో ప్రావిన్సులోని సికాయా నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది.
ఈ భూకంప ధాటికి స్థానికంగా ఉన్న ఒక చర్చి, కాన్వెంట్తో పాటు పలు ఇళ్లు, భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులను ఆసుపత్రికి తరలించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.



