Nellore: నెల్లూరులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులు

Nellore: ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. ఈ క్రమంలోనే తుపాకీతో కాల్పులు జరిపాడు. నెల్లూరులోని ఆచారి వీధికి చెందిన రాజ్మల్ జైన్ కు ముగ్గురు కొడుకులు ఓ కూతురు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు దిలీప్, మూడో కుమారుడు మనోజ్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. రెండో కుమారుడు హితేష్ కుమార్ వ్యసనాలకు బానిసై పెళ్లి తరువాత వేరే వీధిలో వేరుగా ఉంటున్నాడు.తండ్రి నుంచి ఇప్పటికే 40 లక్షలు తన వాటాగా ముందుగానే తీసుకున్నాడు.
ఆ డబ్బుతో బెంగళూరులో వ్యాపారం చేసి నష్టపోయాడు.ఐదు సంవత్సరాల నుంచి సుబేదారు పేటలో దుర్గ గ్లాస్,ప్లైవుడ్ దుకాణం నిర్వహిస్తుండగా నష్టాలు చవి చూశాయి. అప్పటి నుంచి ఆస్తిలో వాటా కావాలని తల్లిదండ్రులు,అన్నదమ్ములను వేధింపులకు గురి చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి తండ్రితో గొడవకు దిగుతున్నాడు.ఈ నెల 11న మరోసారి తండ్రి వద్దకు వచ్చి ఆస్తి పంపకాలు చేస్తారా? లేకతుపాకీతో కాల్చుకుని చనిపోతానని బెదిరింపులకు దిగాడు. కానీ ఆ సమయంలో తుపాకీ పేలకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంతలో ఇతర పెద్దలు జోక్యం చేసుకోవడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది.
మరో ఐదుగురితో ఇంటికి వచ్చి తలుపులు తీయాలంటూ గొడవ చేశాడు. కేకలు వేస్తూ బీభత్సం సృష్టించాడు. ఎవరూ రాకపోవడంతో లైసెన్సు ఉన్న పిస్తోల్ తో ఒక రౌండు ఇంటి తలుపులపై కాల్చాడు. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. భయాందళనలో ఉన్న బాధితులు ఎస్పీ కృష్ణకాంత్ కు ఫిర్యాదు చేశారు. చిన్నబజారు పోలీసులను అప్రమత్తం చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.