Womens World Cup 2025 : రికార్డ్ చేజింగ్.. వరల్డ్ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్

Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా అద్భుతం సృష్టించింది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేస్తూ, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లోకి అడుగుపెట్టింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో భారత్ చారిత్రక విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అజేయంగా 127 పరుగులతో అద్భుత సెంచరీతో చెలరేగింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్ల నష్టానికి 341 పరుగులతో ఛేదించింది.
లక్ష్యం 339! ప్రపంచకప్లోనే కాదు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టూ అంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు. పైగా ప్రత్యర్థి ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఛేదన భారత్కు అసాధ్యమే అనుకున్నారంతా! హర్మన్ప్రీత్ బృందం గట్టెక్కగలదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యమే! కానీ కంగారూలకు కలలో కూడా ఊహించని షాక్.
భారత్ అద్భుతమే చేసింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ.. అంచనాలను తలకిందులు చేస్తూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయాన్నందుకుంది. వన్డే ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లి భారత్ కప్పు కలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరం నిలిచింది.
ఈ విజయంతో భారత్ మూడోసారి ప్రపంచకప్ ఫైనల్కు చేరగా, ఆస్ట్రేలియా 15 మ్యాచ్ల విజయ పరంపరకు తెరపడింది. అంతేకాకుండా, మహిళల, పురుషుల వన్డే ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే ఇది అత్యధిక విజయవంతమైన ఛేదనగా రికార్డు సృష్టించింది. 2015 పురుషుల ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఛేదించిన 299 పరుగుల రికార్డును భారత్ అధిగమించింది.
భారీ లక్ష్య ఛేదనలో భారత్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు షఫాలీ వర్మ , స్మృతి మంధన త్వరగా ఔటవ్వడంతో 47 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 89 పరుగులతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దింది. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్కు 167 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
హర్మన్ప్రీత్ ఔటైన తర్వాత కూడా జెమీమా ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా ఆడింది. దీప్తి శర్మ , రిచా ఘోష్ , అమన్జోత్ కౌర్ కీలక సమయాల్లో రాణించి ఆమెకు మద్దతుగా నిలిచారు. అమన్జోత్ ఫోర్తో విజయ లాంఛనాన్ని పూర్తి చేయగా, జెమీమా ఆనందంతో కన్నీటిపర్యంతమైంది. ఇది ఆమెకు ప్రపంచకప్లో తొలి సెంచరీ సాధించింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫోబ్ లిచ్ఫీల్డ్ 119 పరుగులతో కదం తొక్కగా, ఎల్లీస్ పెర్రీ , ఆష్లే గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో నల్లపురెడ్డి శ్రీ చరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, అద్భుతమైన పోరాట పటిమతో విజయం సాధించిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.



