Harish Rao: రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు.. నల్లమల పిల్లి..

Harish Rao: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు చేశారు. రేవంత్ నల్లమల పులి కాదు, నల్లమల పిల్లి అని సెటైర్లు వేశారు. గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతే, కృష్ణా నీళ్లు కర్ణాటక తీసుకుపోతే, తెలంగాణ పరిస్థితి దారుణంగా మారుతుందని చెప్పారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు.
రేవంత్ ఇటీవల కర్ణాటకకు వెళ్లినప్పుడు, అక్కడి సీఎం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ దగ్గర ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై మాట్లాడతాడని అనుకున్నా, ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని హరీశ్ రావు విమర్శించారు. రాహుల్ గాంధీకి దగ్గరగా ఉన్నా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫోన్ కూడా చేయలేకపోతున్నాడని అన్నారు.
“రేవంత్ ఢిల్లీకి బ్యాగులు మోయడం ఒక్కటే పని కాదు. తెలంగాణ ప్రజల బాగోగుల గురించి కూడా ఆలోచించాలి” అని హరీశ్ రావు సూచించారు. కర్ణాటక 112 టీఎంసీలు, మహారాష్ట్ర 74 టీఎంసీలు నీళ్లు ఆపేస్తే, మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలన్నారు. “నువ్వు నిజంగా నల్లమల పులివైతే మాట్లాడి చూపించు, కానీ పిల్లివి, ఎలుకవు కాబట్టి మౌనం వహిస్తున్నావు” అంటూ హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.



