Modi: రైతుల ప్రయోజనాలపై భారత్ ఎప్పుడూ రాజీపడదు

Modi: రష్యా చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై సుంకాలను రెట్టింపు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటివరకు ఉన్న 25శాతం సుంకాలను 50శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలపై ఎన్నటికీ రాజీపడే ప్రసక్తే లేదంటూ అమెరికాను ఉద్దేశిస్తూ గట్టిగా బదులిచ్చారు.
దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమెరికాతో వాణిజ్యం, టారిఫ్ల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. రైతుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్య మిస్తున్నామని అన్నారు.
రైతులు, మత్స్యకారులు, పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీపడబోమని స్పష్టం చేశారు. అలా చేయడం వల్ల మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తమకు తెలుసని రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా భారత్ సిద్ధమేనని మోదీ వ్యాఖ్యానించారు.



