తెలంగాణ

రేవంత్ రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్..!

బనకచర్ల ప్రాజెక్టు అనగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టుగా చర్చల్లో నలుగుతోంది. అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే రాజకీయాస్త్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు విషయంలో తమ వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరిస్తున్నాయో, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా అదే పట్టుదలతో వ్యవహారం నడుపుతున్నాయి. ఈ ప్రాజెక్టు అటు ఆంధ్రప్రదేశ్‌లో , ఇటు తెలంగాణలో పొలిటికల్ వార్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్గతంగా రాజకీయ దుమారం రేపుతోన్న బనకచర్ల ప్రాజెక్టును రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుందా అన్న కోణంలోనే నేతలు ఆలోచన ఉన్నట్టు స్పష్టమవుతోంది.

తెలంగాణ, ఏపీ ల మధ్య ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఏర్పడిందే.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై అని తెలిసిందే. ప్రస్తుతం బనక చర్ల ప్రాజెక్ట్ వివాదంతో మరల రెండు తెలుగు స్టేట్స్ మధ్య అగాథం ఏర్పడిందని చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీల మధ్య రాజకీయ విబేధాలు ఉన్నా ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు, రేవంత్ లను పొలిటికల్ సర్కిల్ లో గురుశిష్యులుగా పేర్కొంటారు.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య సత్సంబంధాలు ఉండటంతో ప్రభుత్వాల మధ్య కూడా గత ఏడాదికాలంగా మంచి సంబంధాలే కొనసాగాయి. ఇద్దరు సీఎంలు స్వయంగా కలుసుకుని విభజన సమస్యలపై కూడా చర్చించుకున్నారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య మళ్ళీ సంబంధాలు బలపడుతున్న సమయంలో బనకచర్ల ప్రాజెక్ట్ చిచ్చు పెట్టింది.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తమ నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు చేస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఏపీ మాత్రం ఎవరికీ ఉపయోగం లేకుండా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను వాడుకునేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు.. దీని వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని చెబుతోంది. ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ ఇరురాష్ట్రాల మధ్య మరోసారి జలజగడానికి కారణమయ్యింది.

ఈ ప్రాజెక్ట్ వివాదం చివరకు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య వార్నింగ్ లకు దారితీసింది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పొలిటికల్ గురువు చంద్రబాబుకే వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో పలుకుబడి ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకుటున్నావా చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమంటూ గట్టిగానే హెచ్చరించారు. బనక చర్ల ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల కోసం కలిసి రావాలన్నారు. దీని కోసం ఎంతదూరమైన వెళ్తామన్నారు.

ఏపీలోని రాయలసీమలో నదుల అనుసంధానంలో భాగంగా నిర్మిస్తున్న బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ విషయంలో చంద్రబాబుతో పోరాటనికి అయినా సై అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో విపక్షాలు చంద్రబాబుతో రేవంత్ కుమ్మక్కయ్యారంటూ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు.

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి సముద్రంలోకి కలిసిపోయే మిగులు జలాల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సముద్రంలో కలిసే నీటి వాడకం విషయంలో సమస్యలు సృష్టించడం ఎంత వరకూ సమంజసమని రేవంత్ ను చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పటికే గోదావరి నీటిని ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయని, ఆ మాటకొస్తే పోలవరం తప్ప మిగతా ప్రాజెక్టులేవీ అనుమతులు లేనివే అన్నారు.

మనం మనం కొట్లాడుకుంటే ఎవరికి లాభం అంటూ రేవంత్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. అయినా తాను తెలంగాణపై ఎప్పుడైనా గొడవపడ్డానా అని ప్రశ్నించారు. కృష్ణానదిలో అసలే తక్కువగా ఉన్న నీటిపై గొడవలు పడితే లాభం లేదని రేవంత్ కు స్పష్టం చేశారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దామని రేవంత్ కు ఆఫర్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ ఎవరి శక్తి మేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందామని కూడా ఆఫర్ చేశారు.

అంతే కానీ ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదన్నారు.కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాగే కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయని, కొత్త ట్రైబ్యునల్ ఎలా కేటాయిస్తూ అలా నీళ్లు తీసుకుందామని ప్రతిపాదించారు. మరోవైపు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు తాను ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదని కూడా రేవంత్ కు చంద్రబాబు గుర్తుచేశారు. కాబట్టి బనకచర్లకు అభ్యంతరాలు చెప్పొద్దని పరోక్షంగా ఆయన్ను కోరారు.

తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చలేపుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఇద్దరు సీఎంలు సమన్వయం పాటించి..రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పాటుపడాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button