Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది

Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రెడ్బుక్ రాజ్యాంగానికి వైసీపీ కార్యకర్త చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పెదనెమలిపురి గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణను పోలీసులు వేధించి, హింసించారన్నారు.
తనపై గతంలో తన వ్యాపార భాగస్వాములు చేసిన ఆరోపణలకు సంబంధించి సత్తెనపల్లి సీఐ, ఎస్సై విచారించినప్పటికీ, లక్ష్మీనారాయణకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ విషయాన్ని విడిచిపెట్టారు. కాని, అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇదే విషయంపై 2 నెలల తర్వాత సత్తెనపల్లి డీఎస్పీ పిలిపించుకుని తీవ్ర వేధింపులకు దిగారని జగన్ ఆరోపించారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాడివైనా నువ్వు వైసీపీలో ఎందుకున్నావు అని డీఎస్పీ తీవ్రంగా అవమానపరిచి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తామని, డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించారు. డీఎస్పీ దుర్మార్గంపై వాంగ్మూలం ఇచ్చిన లక్ష్మీ నారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తనను వేధింపులకు గురి చేసిన వ్యక్తుల పేర్లతో లేఖ రాశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు జగన్ ట్వీట్ చేశారు. లక్ష్మీనారాయణ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు.