తెలంగాణ హైకోర్టు చరిత్రలో తొలిసారి.. ఒకే రోజు.. ఒకే కేసులో తప్పుకున్న ముగ్గురు న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టు చరిత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ నుంచి ఒక్కరు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు న్యాయమూర్తులు తప్పుకున్నారు. అది కూడా ఒకే రోజు తప్పుకోవడం సంచలనంగా మారింది. ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణే ఇందుకు కారణం. ఒకే రోజు ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ కె.శరత్లు కేసు విచారణ నుంచి తప్పుకోవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.
ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషులు సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. గాలి జనార్దన్రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ కంపెనీ, మెఫజ్అలీఖాన్లు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మే 21న ఈ పిటిషన్లపై జస్టిస్ నందికొండ నర్సింగ్రావు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వీరు మూడున్నరళ్లకు పైగా జైలు జీవితం గడిపారని అందువల్ల వీరికి బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టుకు విన్నవించారు. కానీ న్యాయమూర్తి పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనలతో నిరాకరించారు. సీబీఐ వివరణ లేకుండా తాము ఉత్తర్వులు జారీ చేయలేమన్నారు. విచారణను ఈ వారానికి వాయిదా వేశారు.
అయితే ఈపిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. ముందుగా ఇవి జస్టిస్ కె.శరత్ బెంచ్ ముందుకు..ఆ తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ బెంచ్ ముందుకు వచ్చాయి. వీరిద్దరూ తప్పుకోవడంతో న్యాయవాదులు.. వీటి గురించి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు.
ఇద్దరు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకొన్నారని కనుక ఆయననే వీటిని విచారించాలని న్యాయవాదులు అభ్యర్థించారు.దీంతో జస్టిస్ నగేశ్ భీమపాక ఈ పిటిషన్లకు సంబంధించిన ఫైళ్లను తెప్పించి పరిశీలించారు. ఆ తర్వాత ఆయన ఇది ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు అని తాను కూడా తప్పుకుంటున్నానని తెలిపారు. ఈ సంఘటన తెలంగాణ హైకోర్టులో చరిత్రలో సంచలనంగా మారింది.