అకాల వర్షం.. అన్నదాత ఆగం

పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. సాగునీటి కష్టాలను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. చేతికొచ్చిన మొక్కజొన్న, వరితో పాటు మామిడి పంట ఎటూ కాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. సాగునీరు కష్టాలకు ఓర్చి పంట సాగు చేసిన రైతును ఈ వర్షాలు నిండాముంచాయ్. వడగళ్ల వానతో సుమారు వెయ్యి ఎకారాల పంట నష్టపోయింది. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. బలమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా చేతికొచ్చిన వరి పంట, మొక్కజొన్న, మామిడి తోటలు చాలా వరకు నష్టపోయాయి. ఏపుగా పెరిగిన వరిపంట పూర్తిగా నేలకొరిగింది. గట్టి పడిన వరి ధాన్యం వందల ఎకరాల్లో రాలి నేలపాలైంది.
కాగా జిల్లాలో సూమారు 884 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సూమారు 380 రైతులు నష్టపోయినట్లు సమాచారం. అలాగే కామారెడ్డి జిల్లాలోని 136 ఎకరాల్లో దాదాపు 140 మంది రైతులకు సంబంధించిన పంట నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. అయితే అధికారులు నివేదిక కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్లు రైతులు చెపుతున్నారు.
కొద్ది మొత్తంలో నష్టపోయిన పంటలను అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదని పెద్ద మొత్తంలో నష్టపోయిన పంటలనే లెక్కలోకి తీసుకుని నష్టాన్ని ప్రాథమిక అంచనాగా పంపిస్తున్నారని మండిపడుతున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం అదుకొవాలని కోరుతున్నారు. అయితే జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం రావాలంటే కచ్చితంగా పంట నష్టంపై వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించాలి.
ఆ రెండు ప్రభుత్వశాఖలు సంయుక్తంగా సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే ప్రభుత్వం నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు మాత్రమే ప్రాధమిక నివేదిక సమర్పించారు. రెండు శాఖలు సంయుక్తంగా నివేదిక త్వరగా సమర్పించాలని రైతులు కొరుతున్నారు.
మరోవైపు ప్రకృత్తి విపత్తులతో పంటలకు నష్టం వాటిల్లితే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇప్పుడిదే రైతులకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో కూడా అమలై ఉంటే ఇప్పుడు కచ్చితంగా ప్రతి ఎకరాకు కనీసం 20 వేలైనా పంట నష్టం చేతికొచ్చేదని, ఆ సాయాన్ని తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి అరుగాలం కష్టపడిన రైతుకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయ్. ఒకవైపు సాగునీటి కష్టాలు మరోవైపు అకాల వర్షాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయ్ పంట నష్టాన్ని త్వరగా అందించాలని రైతులు కోరుతున్నారు.