కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భట్టి, తుమ్మల భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్షాను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. తెలంగాణలో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని జాతీయ విపత్తుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు.
పంట, ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని కేంద్రం తక్షణమే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలతో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వరదలు సంభవించి మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25 శాతం అధికంగా ఉందని పేర్కొన్నారు. 8 జిల్లాల్లో 65 నుంచి 95 శాతం అదనపు వర్షపాతం నమోదైందని వర్షాలు కొనసాగుతూనే ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు నష్టపోయాయని వివరించారు. గతేడాది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా 11 వేల 713 కోట్ల సహాయం కోరినప్పటికీ కేంద్రం నిధులేమీ ఇవ్వలేదని, కేవలం సాధారణ నిధులే విడుదలయ్యాయని గుర్తు చేశారు.
దాంతో పునర్నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని అమిత్ షా దృష్టికి తెచ్చారు. గతంలో కోరిన 11 వేల 713 కోట్లతో పాటు తాజాగా ప్రాథమిక అంచనా ప్రకారం 5 వేల 18 కోట్లు కలిపి మొత్తం 16 వేల 732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు.



