Pakistan: రోజులు గడుస్తున్నా కొద్దీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయ్: పాక్ రక్షణ మంత్రి

Pakistan: రోజులు గడుస్తున్నా కొద్దీ భారత్- పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. భారత్- పాక్ల మధ్య శాంతిని నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరుదేశాలూ తగ్గడం లేదన్నారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రోజురోజుకీ ఉద్రిక్తత పెరుగుతోందన్నారు పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. శాంతి నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా తీవ్రతరంగా ఉన్నాయన్నారు.
ఒకవేళ భారత్ దాడులు నిర్వహిస్తే తాము ప్రతిదాడి చేస్తామన్నారు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. అది భారత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంద్నారాయన. క్షేత్రస్థాయిలో భారత్ తీవ్రంగా చర్యలు తీసుకుంటోందని ఇరు దేశాల మధ్య శాంతికి భారత్ అంగీకరించే పరిస్థితులు కనిపించట్లేదన్నారు. భారత వైఖరి పట్ల పాక్ గట్టిగానే స్పందిస్తుందన్నారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఆ దేవుడే సహకరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న దాయాది సైన్యం వరుసగా ఏడో రోజు దుశ్చర్యను కొనసాగించింది. తాజాగా ఎల్వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.