Telangana: గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్

Telangana: ప్రజాస్వామ్యమంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వమని చెప్తారు. అంటే ప్రజలే ప్రభువులు అన్న సందేశాన్ని శతాబ్దాల క్రిందట అమెరికన్ మహాశయుడు అబ్రహం లింకన్ ఘనంగా ప్రకటించారు. ఈ సూక్తిని నేటికీ మన పాలకులు వళ్లెవేస్తుంటారు. ఎందుకంటే ఇది కేవలం ఒక నానుడి మాత్రమే కాదు. ఒక సూక్తి అంత కంటే కాదు. ఒక విధానం. ఒక పద్దతి. ప్రజల ద్వారా ఎన్నుకున్న పాలకులు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని అంటారు. కానీ పాలకులు మాత్రం ఆ ఊసే మరచిపోతారు. వీళ్లని కాదు.. వాళ్లని కాదు ఎవరిదైనా అదే పంధా.. కాకుంటే కథనంలో మాత్రం మార్పులుంటాయ్. అంటే అమల్లో మార్పులుంటాయ్. పాత సీసాలో కొత్త సారా అంటూ చెప్పుకునే ప్రాస ఇప్పుడు మన పథకాల విషయంలోనూ జరుగుతుందంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ప్రభుత్వ సంకల్పాన్ని కచ్చితంగా హర్షించాల్సిందే. ప్రజల కోసం ప్రజాసభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయడమన్నది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువుటద్దం. కానీ కొన్నిసార్లు ఈ ప్రక్రియ సామాన్యులను వేధిస్తుంటుంది. నిరుపేదలను వెక్కిరిస్తుంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలిచ్చింది. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు వాగ్దానం చేసింది. వీటిలో కొన్ని పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే కొన్ని పథకాల అమలుకు ఆర్థిక ఇబ్బందులూ ఎదురవుతున్నాయ్. అయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని రేవంత్ సర్కారు ఘనంగా ప్రకటించుకుంటోంది. ఏడాది పాలన పూర్తి సందర్భంగా వాగ్దానాల అమల్లోకి తామెవరికీ తీసిపోమంటూ ఘనంగా నేతలు ప్రకటించేశారు. కానీ ఇప్పుడు గ్రామ సభల్లో ప్రజలు అధికారులపై తిరగబడేలా సీన్ మారింది. రాష్ట్రంలోని అనేక గ్రామ సభల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. పథకాల అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ వివాదాస్పదమవుతోంది. జనం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. గ్రామ సభల్లోనే అర్హులైన లబ్దిదారుల పేర్లను ప్రకటిస్తుంటే.. తమ పేర్లు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనర్హులకు పథకాలను ఇస్తున్నారని, సొంత పార్టీ వారికే సంక్షేమ పథకాలు దక్కేలా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వివాదస్పదమవుతోంది. ఈ నెల 26 నుంచే లబ్ధిదారులకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోండటంతో అవేశకావేశాలు ఎక్కువవుతున్నాయి. బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అర్హతలున్న చాలా మంది ఆందోళనకు దిగుతున్నారు. పక్కవారికి వచ్చి, తమకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సన్న బియ్యం ఆరు కేజీలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించడంతో లొల్లి ఎక్కువవుతోంది. తమకెందుకు రేషన్ కార్డు ఇవ్వరని, తమ పేరు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎందుకు లేవని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇల్లు కోసం లబ్ధిదారు ఫొటో తీసే సమయంలో వెనుక ఆర్సీసీ స్లాబ్ ఇల్లు కన్పిస్తే.. ఇక లబ్ధిదారు వివరాలు యాప్లో ఎగిరిపోతున్నాయంటూ కొందరు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
అటు గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని మంత్రులు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయని.. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కస్సుమన్నారు. అర్హులైనవారందరికీ పథకాలందిస్తామంటూ మంత్రులు భరోసా ఇస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికపై అపోహలు వద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులందరికీ రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్ కార్డుకు కాంగ్రెస్ పార్టీ భరోసా అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. ముందుగా తామేం జాబితాలు తయారు చేయడం లేదని… గ్రామ సభల్లోనే అర్హులను ఎంపిక చేస్తామని.. అవాస్తవాలు నమ్మొద్దన్నారు.
అయితే విపక్షాలు మాత్రం ప్రభుత్వతీరును ప్రశ్నిస్తున్నాయ్. కాంగ్రెస్ తీరును పల్లెలు ఎండగడుతున్నాయన్నారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. ప్రజలు తిరగబడుతుంటే.. ప్రభుత్వ పెద్దలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారని హారీష్ రావు విమర్శించారు. ప్రజలు గ్రామాల్లో గళం విప్పుతుంటే మంత్రులెక్కడని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత పాలన ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. దరఖాస్తుల దందా నడవదని, ప్రజా ఆగ్రహ జ్వాల ఆగదన్నారు.