తెలంగాణ

భానుడు భగభగ.. జనం విలవిల

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగభగమండుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లో అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుంది. రోడ్లు నిర్మానుషంగా మారి కర్ప్యూను తలపిస్తున్నాయి. ఈ వేసవిలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్టోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.

వారం రోజులుగా సగటు ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు పైగా నమోదవుతూ వస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీలు దాటింది. కనిష్ఠ ఉష్ణోగ్రత 24 నుంచి 29 వరకు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండల ప్రభావం తీవ్రమవుతోంది. మధ్యాహ్నం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

ఎండలకు భయపడి అత్యవసర సమయంలో తప్పా జనాలు బయటికి రావడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల ప్రభావంతో చిరు వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా జుక్కల్ నియోజకవర్గంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా జుక్కల్ లో 44.2, మద్నూర్‌లో 43.8, బిచ్కుందలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్క నసురుల్లాబాద్ మండలం లోనే 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండగా.. 43.8 ఉష్ణోగ్రత నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది.

అత్యవసరం అయితే తప్ప జనాలు బయటికి రావద్దని ఎండలో బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వడ దెబ్బ తగలకుండా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. అనారోగ్యానికి గురికాకుండా కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను నిత్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యుత్‌ వినియోగం కూడా అంతకంతకు పెరుగుతున్నది. వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం తగ్గుముఖం పడుతున్నప్పటికీ, అక్కడక్కడ చివరి తడి కోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. గృహావసరాలకు వినియోగం క్రమంగా పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button