తెలంగాణ

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాలు

Hyderabad: హైదరాబాద్‌ మహానగరంలోని ట్రాఫిక్‌ జంక్షన్లు ట్రాఫిక్‌తో ఎక్కడికక్కడే జామ్‌ అవుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌పై పర్యవేక్షణ చేస్తూ, ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు సాగాలి. కానీ ట్రాఫిక్‌ను పట్టించుకునేవారు లేరు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ అనేది పెద్ద సమస్య, దీన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ చిక్కులు లేకుండా చేయాలని ట్రాఫిక్‌ విభాగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి నగర పౌరుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చింది. కానీ రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల కారణంగా ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా శాశ్వత పరిష్కారం దొరకడంలేదు.

నగరంలో మోటార్ సైకిళ్ల సంఖ్య ప్రతిఏటా భారీగా పెరుగుతోంది. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు, క్యాబ్‌లు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. 2024తో పోలిస్తే 2025 జనవరికి 4 లక్షల 35 వేల 893 వాహనాలు గ్రేటర్‌ పరిధిలో పెరిగాయి. ఇందులో ద్విచక్ర వాహనాలే 3 లక్షల 12 వేల 776లు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే కార్లు 86 వేల 703, క్యాబ్‌లు 10 వేల 838 పెరిగాయి. 2024 జనవరిలో గ్రేటర్‌లో అన్నిరకాల వాహనాలు 79 లక్షల 43 వేల 518 ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 83 లక్షల 79 వేల 438 కు చేరింది.

వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో గ్రేటర్‌ పరిధిలో ట్రాఫిక్‌ చిక్కుముడులు ఎక్కువవుతున్నాయి. సిటీ బస్సుల్లో రోజుకు సగటున 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటే, మెట్రో రైలులో 5 లక్షలు, ఎంఎంటీఎస్‌లో 50 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ప్రజారవాణా మరింత విస్తృతమైతేనే వ్యక్తిగత వాహనాల వినియోగం కొంత మేరకు తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో విద్యుత్తు వాహనాల వినియోగం పెరిగితేనే కాలుష్యానికి కొంత మేరకు ముకుతాడు వేసేందుకు అవకాశం ఉంటుంది.

ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం చిక్కుకోవడంతో నగర పౌరులు కాలుష్యం బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్‌ నుంచి ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి. ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కన్పిస్తుంటారు, రద్దీ సమయం అయిపోగానే ట్రాఫిక్‌ పోలీసులు బిస్తర్‌ సదిరేస్తున్నారు. ప్రతి రోజు కానిస్టేబుల్స్‌, హోంగార్డులతో ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్ల ఫొటోలు తీయిస్తున్నారు. అధికారులు చలాన్లు పెరుగుతున్నాయా? అనే విషయంపైనే దృష్టి పెట్టి, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను గాలికొదిలేశారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పుడో ఓ సారి ఉన్నతాధికారులు ట్రాఫిక్‌పై సమీక్ష పెట్టడం, రెండు రోజులు హడావిడి చేసి..తరువాత ట్రాఫిక్‌ వ్యవస్థను విస్మరిస్తుండటంతో ట్రై పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ విభాగంపై పట్టుతప్పి, సామాన్యులకు శిక్షగా మారిందంటూ వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ట్రాఫిక్‌ అధికారులు సమీక్షలు నిర్వహించాలి. కానీ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల వద్ద కూడా నిర్వహణ సక్రమంగా లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇలా సిగ్నల్స్‌ వద్ద నగరంలో ట్రాఫిక్‌ కూడళ్లలో వాహనదారుడు ఎంత సేపు ఎదురు చూస్తున్నాడనేది మాత్రం ఎన్ని ప్రభుత్వాలు మారినా అధికారులకు తెలియడంలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button