AP Cabinet: అమరావతి రైతులకు ఏపీ కేబినెట్ అదిరిపోయే న్యూస్

AP Cabinet: అమరావతి రైతులకు ఏపీ కేబినెట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు మంత్రులతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వం మారి వైసీపీ రావడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు కారణమైన ఓ అంశంలో మార్పులు చేసేందుకు వీలుగా కేబినెట్ ఇవాళ తీర్మానం చేసింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రైతులకు తిరిగి ఊపిరి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం వచ్చినా అమరావతి రాజధాని మారకుండా ఉండాలంటే దీనిపై గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన కేబినెట్ అమరావతిని కేబినెట్ గా నిర్ధారిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతిని ఏపీ రాజధానిగా 2014లో చేసిన రాష్ట్ర పునర్ విభజన చట్టంలో చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు..
గతంలో అమరాతి రాజధాని స్ధానంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రయత్నాలకు ముఖ్య కారణం రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడమే. ఏపీ రాజదానిగా అమరావతిని నిర్ణయించిన గత టీడీపీ ప్రభుత్వం అప్పట్లో దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించకుండానే పనులు చేసుకుంటూ పోయింది.కానీ మధ్యలో అధికారం మార్పుతో వైసీపీ ప్రభుత్వం రావడం, గెజిట్ లేదన్న కారణం చూపుతూ మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేసి విఫలం కావడం జరిగిపోయాయి.
దీంతో మరోసారి అలాంటి అనుభవాలు ఎదురుకాకుండా అమరావతి రైతులు ఈసారి తమకు గెజిట్ ఇప్పించాల్సిందేనని తాజాగా చంద్రబాబుతో జరిగిన భేటీలో గట్టిగా అడిగారు. దీంతో గెజిట్ కేంద్రం చేతుల్లో ఉందని, తనవైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తానంటూ చంద్రబాబు వారికి నచ్చజెప్పారు.
ఇప్పుడు దీనికి అనుగుణంగా కేబినెట్ అమరావతే రాజధాని అంటూ తీర్మానం చేసింది. దీన్ని కేంద్రానికి పంపుతారు. కేంద్రం పార్లమెంటులో ఏపీ విభజన చట్టానికి సవరణ బిల్లు ప్రతిపాదించి అందులో అమరావతిని రాజధానిగా చేర్చి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.