KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ

KCR: బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ముగిసింది. ఆయన్ను పీసీ ఘోష్ కమిషన్ సుమారు 50 నిమిషాల పాటు విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించింది.
115వ సాక్షిగా ఆయన్ను విచారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్ నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట హరీశ్రావు కూడా ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్నాళ్లూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్రావును సైతం విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్తో ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి బ్యారేజీల నిర్మాణ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, నీటిపారుదల, ఆర్థిక శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించడం, వారి నుంచి అఫిడవిట్లు తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ను సైతం పూర్తిచేసింది. తాజాగా కేసీఆర్ను విచారించింది.