తెలంగాణ

Swarnagiri: ఆధ్యాత్మిక సిరి.. స్వర్ణగిరి!

Swarnagiri: ఆధ్యాత్మిక సిరి…స్వర్ణగిరి. భూలోక వైకుంఠ క్షేత్రం. తెలంగాణ తిరుపతిగా చరిత్రలో నిలిచిపోయింది. భువనగిరిలో ఉన్న స్వర్ణగిరికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరెంతో విశిష్టతను సంతరించుకుంది. దక్షిణ భారత శైలిలో దేవాలయం నిర్మించబడింది. ప్రవేశ ద్వారం వద్ద గోపురం అందర్నీ ఆకట్టుకుంటోంది. గర్భగృహంలో దైవిక శక్తితో ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి.

అద్బుతమైన శిల్పకళ… రాజధానికి కూతవేటు దూరం యాదాద్రి జిల్లా భువనగిరిలోని మానేపల్లి హిల్స్‌లో నిర్మితమైంది స్వర్ణగిరి. 22 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం జరుగుతుంది. అప్పటి నుంచి భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు.

బంగారు కొండ అని అర్ధం వచ్చేది స్వర్ణగిరి. దాని ఎత్తైన ప్రదేశం మరియు ప్రధాన దేవతగా పూజించబడే శ్రీ వెంకటేశ్వర స్వామి బంగారు విగ్రహం కారణంగా సముచితంగా పేరు పొందింది. ఆనందం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం దైవిక ఆశీర్వాదాలను కోరుకునే భక్తులలో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

హైదరాబాద్‌ తూర్పున టెంపుల్‌ టూరిజానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడం విశేషం. దీంతో ఇష్టదైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. భువనగిరి పట్టణ శివారులో నిర్మించిన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు, యాత్రికులు క్యూ కడుతున్నారు.

కొండపై నుండి కనిపించే దృశ్యాలు, ముఖ్యంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో, ఉత్కంఠ భరితంగా ఉంటాయి. స్వర్ణగిరి ఆలయ ప్రాంగణంలో ఉన్న వాతావరణం ఆలయ ఆకర్షణను మరింత పెంచుతుంది. స్వర్ణగిరి కేవలం పూజకు మాత్రమే కాకుండా ధ్యానం, శాంతికి ప్రతీకగా నిలుస్తోంది. ఆత్మపరిశీలనకు సరైన ప్రదేశంగా మారింది స్వర్ణగిరి.

తెలుగు రాష్ట్రాల్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలియనివారుండరు. అదే స్థాయిలో గుర్తింపు పొందుతోంది స్వర్ణగిరి. భూలోక వైకుంఠ క్షేత్రంగా నిలుస్తోంది. వరంగల్‌ జాతీయ రహదారికి ఆనుకుని ఆలయాలు రూపుదిద్దుకోవడం, బస్సు, రైళ్ల సదుపాయాలూ ఉండటంతో ప్రయాణం మరింత సులభంగా మారుతోంది.

స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయ నమూనాను పోలి ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ నుంచి సైతం భక్తులు దేవాలయాలను దర్శించుకుంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button