SLBC Tunnel: 9 రోజుకు చేరుకున్న SLBC టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel: SLBC సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే వారి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ కొనసాగుతుంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలింది. దీంతో టన్నెల్లో ఎనిమిది రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
మరోవైపు ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యలు ఒకెత్తు అయితే... ఇకపై వేసే ప్రతి అడుగూ ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు జీపీఆర్ టెక్నాలజీ, డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు. వాటి ఫలితాలపై శనివారం స్పష్టత వచ్చింది. దీంతో గుర్తించిన ప్రాంతాల్లో రెస్క్యూ స్పీడప్ చేశారు. అక్కడ చిక్కుకున్న వారంతా సొరంగంలో మూడు మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
సొరంగంలో కట్టర్ ప్రాంతం నుంచి ఊట నీరు పెద్ద ఎత్తున వస్తూనే ఉంది. బురద, మట్టి, రాళ్లను లోకో రైలు వ్యాగన్లలో నింపడానికి అక్కడి నుంచి ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం వరకు బృందాలు నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. కార్మికులు కూరుకుపోయిన ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణను సిద్ధం చేశారు. అయితే ఇవాళ నలుగురిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఎన్డీఆర్ఎఫ్, సైన్యం పనిచేస్తున్నాయి. దాదాపు 18 ఏజెన్సీలు, వాటి పరిధిలోని 54 మంది ఉన్నతాధికారులు, 703 మంది సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నార. ప్రతి షిప్టునకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు అటు నాగర్కర్నూల్, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి ఎనిమిది మంది ఫోరెన్సిక్ డాక్టర్లు ఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో మృతదేహాలకు శవపరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించకుంటే ఫోరెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో డీఎన్ఏ పరీక్షలకు నమూనాలు పంపిస్తారు. ఈమేరకు అంబులెన్స్లను కూడా సిద్ధం చేశారు.