Bhimavaram Mavullamma: భీమవరంలో శక్తి స్వరూపిణిగా మావుళ్లమ్మ అమ్మవారు

Bhimavaram Mavullamma: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది చేపల, రొయ్యల చెరువులు. ఇదే ఇక్కడ ప్రధాన ఆదాయ వనరు. మరోవైపు.. ఆధ్యాత్మికంగా కూడా భీమవరం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారు, పంచారామ క్షేత్రాలలో ఒకటైన సోమేశ్వరాలయాలు ఉన్నాయి. బెజవాడ కనక దుర్గ, శ్రీశైలం భ్రమరాంబిక తరువాత అంతటి మహిమ గల తల్లిగా, భక్తుల పాలిట కల్పవల్లిగా భీమవరం మావుళ్లమ్మ కొలవబడుతోంది.
తొమ్మిది దశాబ్దాల క్రితం భీమవరంలో వెలసిన అమ్మవారు.. శక్తి స్వరూపిణిగా పిలవబడుతోంది. అమ్మవారి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అమ్మవారి ఆలయ స్థల పురాణానికి దాదాపు ఎనిమిది శతాబ్దాల చరిత్ర ఉంది. తూర్పు చాళుక్యుల కాలంలోనే.. అమ్మ వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందనేది మరో కథనం. ఆకాలం నుంచే గ్రామదేవతగా అమ్మవారు పూజలందుకుంటున్నారని.. అంతేకాని ప్రత్యేకంగా స్థల పురాణం లేదని స్థానికులు చెబుతున్నారు.
క్రీస్తు శకం 12 వందల సంవత్సరంలోనే అమ్మవారు వెలసినట్లుగా పురాణ కథలు చెపుతున్నాయి. మామిడి తోటలో వెలసిన కారణంగా అమ్మవారు తొలినాళ్ళలో మామిళ్ళమ్మగా తరువాత భక్తులచే మావుళ్ళమ్మగా పిలవబడుతోంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర, ఉత్సవాలు రెండు వేర్వేరుగా జరుగుతుంటాయి. రజక సంఘం ఆధ్వర్యంలో ఒకసారి.. పండ్లు, పూల వర్తక సంఘం ఆధ్వర్యంలో మరోసారి జాతరమహోత్సవాలు జరుగుతుంటాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి వరకు ఉత్సవాలు జరుగుతాయి.
ఇక్కడ తొలినాళ్ళలో పూరిగుడిసెలో ఉత్సవాలు నిర్వహించేవారు. మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని నిర్మించేందుకు గ్రంధి అప్పన్న, మారెళ్ళ మాచిరాజు విశేష కృషి చేశారు. 1920 సంవత్సరంలో కాళ్ళ గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి శిలా విగ్రహానికి రూపకల్పన చేశారు. 1929 లో వచ్చిన పెను తుఫాన్ కారణంగా అమ్మవారి ఆలయం ధ్వంసం అయ్యింది. అప్పట్లో అమ్మవారి ఆలయంలో యంత్ర ప్రతిష్ట జరిపించి.. ఈ ప్రాంతానికి వచ్చిన అరిష్టాన్ని నివారించారు. 1934లో యంత్ర ప్రతిష్ట చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అమ్మవారి ఒంటిపై ఎప్పుుడూ 80 కిలోల బంగారు ఆభరాణాలు ఉంటాయి. ఇది ఇక్కడ ప్రత్యేకత. 1958కి పూర్వం అమ్మవారి విగ్రహాన్ని వీక్షించడానికి భక్తులు భయపడేవారు. దీంతో.. పట్టణానికి చెందిన గ్రంధి అప్పారావు.. అమ్మవారి నేత్రాలను చల్లని నయనాలుగాను, ఉగ్ర స్వరూపాన్ని శాంతి రూపంగాను తీర్చిదిద్దారు. 70 లక్షల రూపాయిలు విలువ చేసే వజ్ర కిరీటాన్ని అలంకరించారు. దీంతో.. శాంతస్వరూపిణిగా మారిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆశక్తి కనపర్చారు. అలా మావుళ్ళమ్మ దేవాలయం ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా వృద్ధి చెందింది. 40 ఏళ్ళుగా అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తారు.