ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు పోల్ అయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి 78.57 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ పోలింగ్ను బీఆర్ఎస్ బహిష్కరించడంతో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు, అఫీషియో సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సారి కూడా ఈ స్థానం ఏకగ్రీవం అవుతుందని భావించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దిగడంతో 22 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.
అత్యధిక ఓట్లు ఎంఐఎం పార్టీకే ఉండటంతో ఈ ఎన్నికల పోలింగ్ లాంఛన ప్రాయంగా ఉండనున్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎంకు మొత్తం 49 ఓట్లు ఉన్నాయి. బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, ఆరుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 25 ఓట్లే ఉన్నాయి.
ఈ విషయం తెలిసినప్పటికీ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా బీజేపీ బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతంరావు, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హాసన్ పోటీలో ఉన్నారు.