Vangalapudi Anitha: విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించిన హోంమంత్రి అనిత

Vangalapudi Anitha: గత జగన్ ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందని హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. విశాఖ సెంట్రల్ జైలులో ఫోన్ కనిపించిందన్న ఆరోపణలతో ఆమె ఇవాళ విశాఖ సెంట్రల్ జైలును పరిశీలించారు. జైలులో గంజాయి వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయన్న అనిత.. జైలు లోపల వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్ప టికే కొంతమందిని విశాఖ సెంట్రల్ జైలు నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు గుర్తుచేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు.
పీఏ జగదీష్ వ్యవహారంపై కూడా హోంమంత్రి అనిత స్పందించారు. జగదీష్ వ్యవహారాలు తెలిపి అప్రమత్తమయ్యానని చెప్పారు. గతంలో రెండుసార్లు పీఏని హెచ్చరించినట్లు వివరించిన అనిత.. పది రోజుల క్రితమే పీఏని తొలగించినట్లు వెల్లడించారు. ఇక పార్టీ, ప్రభుత్వానికి నష్టం జరిగితే ఊరుకోమన్నారు.