Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు కౌంట్డౌన్ షురూ.. రేపటి నుంచే అతి పెద్ద హిందూ ఉత్సవం

Maha Kumbh Mela 2025: అతిపెద్ద ధార్మిక సమ్మేళనానికి కౌంట్డౌన్ షురూ అయ్యింది. భూ మండలంపై జరిగే మహత్తర వేడుకకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచే గంగా, యుమున, సరస్వతి త్రివేణి సంగమంలో మహా కుంభమేళా ప్రారంభంకానుంది. 45 రోజుల పాటు జరనున్న ఈ మహా జాతరకు ఉత్తర ప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం జరిగే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది.
గంగ, యమున, సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో సాగే ఈ మహా కుంభమేళా.. భూమండలంపై జరిగే మహా జాతర. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. 12 ఏళ్లకు ఒకసారి మహా కుంభ జరగనుంది. మూడు నదుల త్రీవేణి సంగమంగా పేరొందిన ప్రయాగ్రాజ్ ఇందుకు వేదికగా నిలుస్తోంది. ఈ మహాజాతర రేపటి నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ మహా కుంభలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి కోట్లాదిగా భక్తులు ప్రయాగరాజ్కు చేరుకుంటారు.
సాధారణంగా కుంభమేళాను నాలుగేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరుగబోతున్న మహా కుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిణామాల వల్ల ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మహా కుంభమేళా కేవలం పండుగ మాత్రమే కాదు, వేల సంవత్సరాల నాటి చారిత్రక మూలాలు ఉన్న ఒక ఆత్మీయ సాంస్కృతిక కార్యక్రమం. ఈ పండగ హిందూ పురాణాలు, ఖగోళ శాస్త్రం, భారతదేశ గొప్ప మతపరమైన వారసత్వానికి నిదర్శనం.