Rangareddy: సినిమా షూటింగ్ లొకేషన్ చూపించేందుకు వెళ్లిన వ్యక్తి మృతి

Rangareddy: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శంకర్పల్లి, గండిపేట నాలుగు లైన్ల రహదారిపై మోకిలా వద్ద టంగుటూరు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. టంగుటూరు గ్రామానికి చెందిన బద్దం శంబారెడ్డి గ్రామంలో సినిమా షూటింగ్ జరిగే చోట కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శవాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
అసలు శంభా రెడ్డి ఎలా మృతి చెందాడు తెలపాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు తెలియ కుండా మృతదేహాన్ని మార్చురీకి ఎలా తరలించారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుమీద బైఠాయించిన ఆందోళన కారులను అక్కడి నుండి పంపించేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. పోలీసులు సినిమా వాళ్ళతో కుమ్మక్కైయ్యారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.