AP News: కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠంపై టీడీపీ కన్ను

AP News: చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం టీడీపీ ప్రయత్నిస్తోందా..! కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠంపై సైకిల్ నేతలు కన్నేశారా..! గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారా..! సీటు దక్కించుకునేందుకు పసుపు పార్టీలోనే పోటీ మొదలైందా..! ఇంతకీ కుప్పం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంటుందా..! చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుందెవరు..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠంపై టీడీపీ నేతలు కన్నేశారు. ఈ నెల 28న కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.టీడీపీ, వైసీపీ నేతలు ఎవరికి వారు వ్యూహాలను రచిస్తున్నారు. చైర్మన్ పీఠం తమకే దక్కుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డామో తమ అధినేత చంద్రబాబుకు తెలుసంటోంది టీడీపీ క్యాడర్. గత ప్రభుత్వంలో కేసులు సైతం ఎదుర్కొని చంద్రన్నకు తోడుగా నిలిచామంటున్నారు సైకిల్ నేతలు. ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి తమకే దక్కుతుందంటున్నారు.
గత ప్రభుత్వ హయాంలో వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్.. తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరడంతో మున్సిపల్ చైర్మన్ సీటు ఖాళీ అయింది. గతంలో వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. నామినేటెడ్ పదవులు, మున్సిపల్ పదవులతో.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పాగా వేయాలని ఫ్యాన్ పార్టీ నేతలు అనుకున్నారు. ఏ ఒక్క ఎలక్షన్ వచ్చినా చేజిక్కించుకోవాలని.. కుప్పంపై తన సత్తా చాలాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలలు కన్నాడు. ఒకానొక దశలో వైసీపీ హవా నడిచిందని చెప్పుకోవచ్చు. దాంతో చంద్రబాబు.. మూడు నెలలకు ఓసారి కుప్పంలో పర్యటించారు.
ఇక అసలు విషయానికి వస్తే కుప్పం నియోజకవర్గంలో జరిగే మున్సిపల్ చైర్మన్ పదవికి చాలామంది ఆశావహులు ఉన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. గతంలో 19 మంది వైసీపీ కార్పొరేటర్లు, 6 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉండడంతో వైసీపీ తరఫున డాక్టర్ సుధీర్ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయ్యింది. ఐదు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడంతో కూటమిలో మొత్తం 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు.
అంతే కాకుండా ఒక వైసీపీ ఎమ్మెల్సీ, ఒక టీడీపీ ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మరో ముగ్గురు టీడీపీకి చేతులెత్తితే.. ఇక మున్సిపల్ చైర్మన్ పదవి కాస్త టీడీపీ పరం అవుతుంది. అందుకే ఇప్పటినుంచే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. 28న జరిగే మున్సిపల్ ఎన్నికల్లోగా ఆ ముగ్గురు కౌన్సిలర్లు వస్తారా.. లేదా అన్నది సస్పెన్స్గా మారింది.
ఇక మున్సిపల్ పీఠం కోసం టీడీపీ కౌన్సిలర్లు చాలా మంది పోటీ పడుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో వన్నెకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు అధికంగా ఉండడంతో సెల్వంకు మున్సిపల్ చైర్మన్ పదవి వరిస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీ కౌన్సిలర్లు సెల్వం, సోము, దాము, షబానా తాజ్లు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు తమకే పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
మొత్తానికి కుప్పం మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఛైర్మన్ సీటు కోసం పసుపు పార్టీ కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి.. కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో తెలియాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.