హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. భర్తను చంపించింది భార్యే

మేఘాలయలో ఇండోర్ హనీమూన్ కు వెళ్లిన నవ జంట అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనమ్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొకరికోసం గాలిస్తున్నారు. ఈ కేసు గురించి మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా కూడా ట్వీట్ చేశారు. ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు పెద్ద విజయం సాధించారని తెలిపారు.
మధ్యప్రదేశ్కు చెందిన ముగ్గురు దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేశారు. మహిళ లొంగిపోయింది. మరొక దాడి చేసిన వ్యక్తిని పట్టుకునే ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. మేఘాలయ డీజీపీ ఇదాషిషా నోంగ్రాంగ్ కూడా ఈ కేసుకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు.
ఇండోర్ రాజా రఘువంశీ హత్య కేసులో ఆయన భార్య సోనమ్ సహా నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సోనమ్కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె పూర్తిగా క్షేమంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను యూపీలోని ఘాజీపూర్లోని వన్ స్టాప్ సెంటర్లో ఉంచారని అన్నారు.