తెలంగాణ
Damodar: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంత్రి దామోదర ఆకస్మిక తనిఖీ

Damodar: హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనర్సింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి, ఓపీలో ఉన్న పేషెంట్లతో మంత్రి మాట్లాడారు. వైద్య సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటెండెన్స్ పరిశీలించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి రాని డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
మరోవైపు ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూపరింటెండెంట్, డీఎంఈని ఆదేశించారు. అదే క్రమంలో ఓపీ, ఐపీ, ఎంసీహెచ్, ఐవీఎఫ్, ఓపీ డయాగ్నస్టిక్ సర్వీసెస్, స్కానింగ్ వార్డులను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవల్లో జాప్యంపై మంత్రి సీరియస్ అయ్యారు. సంబంధిత డాక్టర్లకు షోకాజ్ ఇవ్వాలని డీఎంఈకి ఆదేశాలు ఇచ్చారు.