Musi River: మూసీ రివర్ అభివృద్ధికి కీలక అడుగు.. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4100 కోట్ల రుణానికి అనుమతి!

Musi River: మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్) అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డీపీఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకొన్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రజని తనేజా తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచబ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందజేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట… పంపిన ప్రాథమిక నివేదికలో నదిని పునరుజ్జీవం చేసి ఆర్థిక, పర్యాటక వృద్ధికి తోడ్పడేలా చేయడం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్ మధ్యలో నుంచి మూసీ ప్రవహిస్తోందని, దీన్ని పునరుజ్జీవం చేస్తే జీవ వైవిధ్యం పెరగడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు, సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పడానికి తోడ్పడుతుందని వెల్లడించింది. నదిలో పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేస్తామని, భారీ వర్షాలు, వరదల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, పనులు పూర్తయ్యాక మూసీకి ఇరువైపులా నగర స్వరూపమే మారిపోతుందని, ప్రగతికి కొత్త కేంద్రాలు ఏర్పడతాయని వెల్లడించింది.
ఈ ప్రాజెక్టు కింద నీటి యాజమాన్యానికి సంబంధించి నాలుగు ప్రధానాంశాలు చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందులో… మురుగునీటి శుద్ధీకరణ, వరదనీరు సవ్యంగా వెళ్లేలా చూడటం, వర్షపునీరు-మురుగునీరు కలవకుండా చర్యలు, లాండ్స్కేప్ డెవలప్మెంట్ ఉన్నాయని వివరించింది. లాండ్స్కేప్ డెవలప్మెంట్లో భాగంగా నదిని యథాస్థితికి తేవడం, రివర్ ఫ్రంట్ పొడవునా ప్రజలకు సదుపాయాలు, రోడ్లు, ట్రాన్స్పోర్టును మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్్్స)ను సాధించడంలోనూ దోహదపడుతుందని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఇందులో వివిధ కార్యక్రమాలను చేపడతామని, 2030 డిసెంబరులోగా దీన్ని పూర్తి చేయడం లక్ష్యమని తెలిపింది. ప్రపంచబ్యాంకు రుణం కోసం ప్రతిపాదించిన పనులకు రూ.5,863 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో రూ.4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు అప్పుగా ఇస్తే, మిగిలిన రూ.1,763 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిగిందని వివరించింది. అనుమతులు, పునరావాసం ఇలా అన్ని అంశాలతో ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన కేంద్ర గృహ-పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కమిటీ ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి సూత్రప్రాయంగా అంగీకరించడంతో ముందడుగు పడినట్లు అయింది. డీపీఆర్ల తయారీ బాధ్యతను కన్సల్టెన్సీ సంస్థలకు అప్పగించిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్… త్వరలోనే వాటిని పూర్తి చేయించి కేంద్రానికి, ప్రపంచబ్యాంకుకు అందజేయనున్నట్లు తెలిసింది.