ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపులపై ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపులపై ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసి జీవోలో మార్పులు చేస్తూ ఈ సవరణ జీవో విడుదలైంది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం, డీఏ బకాయిల్లో 10 శాతాన్ని 2026 ఏప్రిల్లో చెల్లిస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను తదుపరి మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు .
ఓపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాకు జమ చేస్తారు. సీపీఎస్ , పీటీడీ ఉద్యోగులకు మాత్రం 90 శాతం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ డీఏ మంజూరు జీవోలో సవరణలపై ఉద్యోగుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీపావళి రోజు జీవోలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి మార్పులు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.



