అక్రమ వలసదారులను గెంటేస్తున్న ట్రంప్.. ఢిల్లీకి రానున్న భారతీయుల విమానం

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అధికారులు ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు. తాజాగా భారత్కు చెందిన అక్రమ వలసదారులతో కూడిన విమానం ఇండియాకు బయల్దేరింది. సీ-17 విమానంలో వీరిని తరలిస్తున్నారు. కాసేపట్లో ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుంది.
అక్రమవలసదారులపై ట్రంప్ మొదటి నుంచి కఠినంగా ఉంటున్నారు. మొదట 538 మందిని అరెస్టు చేసి ఆయా దేశాలకు తరలించారు. ఇక ఎల్ పాసో, టెక్సాస్, శాండియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5వేల మంది అక్రమ వలసదారులను ఆయా దేశాలకు పెంటగాన్ తరలించింది. మిలటరీ విమానాల్లో స్వదేశాలకు పంపిస్తోంది. ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్ తదితర దేశాలకు యూఎస్ విమానాల్లో పలువురిని తరలించింది. ఇక ఒక్కొక్క వలసదారుడిని తరలించేందుకు అమెరికాకు భారీ ఖర్చు అవుతోంది. గతవారం గటెమాలాకు తరలించిన ఒక్కో వ్యక్తిపై అమెరికా సుమారు 4వేల 675 డాలర్లను ఖర్చు పెట్టింది.
అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే భారత్ స్పందించింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. యూఎస్లో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్కు చెందిన వలసదారులు 7లక్షల 25వేల మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 18వేల 000 మందిని భారత్కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వం జాబితాను రూపొందించింది. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది భారతీయులే.
మెక్సికో, కెనడాలపై విధించదలుకున్న 25 శాతం సుంకాలను అమెరికా నెలరోజుల పాటు నిలిపివేయడానికి నిర్ణయించింది. ఇరు దేశాల అధినేతలు అమెరికా సరిహద్దుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాలు 10,000 మంది భద్రతా బలగాలను తమ సరిహద్దులకు పంపించి మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకుంటామని పేర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.