BRS: రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధం

BRS: పదేళ్ల పాలన… 25 ఏళ్ల పార్టీ ప్రస్థానం… తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. గులాబీ పార్టీ పాతికేళ్ల సంబరానికి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి వేదిక కానుంది.
ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేరల్లోనే మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 1213 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి మొత్తంగా 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగసభలను సక్సెస్ చేయడంలో కారుపార్టీ ట్రాక్ రికార్డు వేరే లెవల్. అలాంటి పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతోంది. ఉద్యమ పార్టీగా, అధికారపక్షంగా ఇంతకు ముందు ఒకెత్తు ఇప్పుడు ప్రతిపక్షంగా మరో ఎత్తు.
అందులోనూ 25ఏళ్ల రజతోత్సవ పండగ. అందుకే, మహాసభ నిర్వహణ ద్వారా తెలంగాణ నలుమూలల నుంచి కార్యకర్తలను, ప్రజలను రప్పించాలని చూస్తోంది గులాబీ సేన. ఇప్పటికే అన్ని జిల్లాలోనూ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న గులాబీ హైకమాండ్ అధికారం ఉన్నా, లేకున్నా బహిరంగసభల నిర్వహణలో మనల్ని కొట్టేటోడు లేరన్నట్టుగా మనోధైర్యాన్ని పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు పబ్లిక్ ను తరలించేలా బిఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి కమిటీలు వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఈ కమిటీలు వేస్తామని చెప్పడం ద్వారా బహిరంగ సభను ఉపయోగించుకోవాలని పార్టీ అనుకుంటుంది.
బహిరంగ సభకు పబ్లిక్ ను తరలించే వాళ్లకే రాష్ట్రస్థాయిలో పదవులు ఇస్తామని బిఆర్ఎస్ ఇంటర్నల్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయం అయితే టికెట్లు ఆశించేవాళ్లు, లేకుంటే పోటీ చేసే అభ్యర్థులు పబ్లిక్ ను తరలించే బాధ్యత తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో బిఆర్ఎస్ కు టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్లో నుంచి టార్గెట్లను ఇవ్వడం కూడా మొదలుపెట్టింది పార్టీ.
జిల్లాస్థాయిలో రాష్ట్రస్థాయిలో పదవులు కావాలంటే ఇప్పుడు పబ్లిక్ ను తరలించాలని నిబంధన పెట్టినట్టుగా తెలుస్తుంది.మీరు పబ్లిక్ ను తరలించే సంఖ్యను బట్టి మీకు వచ్చే పదవులు ఆధారపడి ఉంటాయని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పబ్లిక్ ను తరలించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు .
ఇదే సమయంలో నియోజకవర్గాల ఇంఛార్జ్ లు కూడా ప్రత్యేక టార్గెట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నచోట నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మందికి తగ్గకుండా తీసుకురావాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇంకా పార్టీ ఎమ్మెల్యేలు లేకుండా ఇంచార్జ్ లు ఉన్నచోట 4వేల నుంచి 5 వేల వరకు పబ్లిక్ ను తరలించాలని టార్గెట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు.
మొత్తానికి 10 లక్షల మంది వస్తారని బయటికి చెప్తున్నప్పటికీ 5 లక్షల మంది వరకు వచ్చినా సరే సభ గ్రాండ్ సక్సెస్ అయినట్టే అని బిఆర్ఎస్ భావిస్తుంది. అందుకే ఇలా నియోజకవర్గం నుంచి రాష్ట్రం వరకు టార్గెట్లు ఇస్తేనే 5 లక్షల సంఖ్యను దాటే అవకాశం ఉంటుందని పార్టీ ఓ నిర్ణయానికి వచ్చింది.
బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ హోదాలో పార్టీ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా జన సమీకరణతో పాటుగా రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు కేసీఆర్ నాయకులకు , కార్యకర్తలకు ఒక దిశ నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ పరిస్థితులు, ఇవాళ పార్టీ పరిస్థితిని వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు, అవలంభిస్తున్న తీరు పైన కేసీఆర్ విరుచుకుపడే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం ప్రజలందరి చూపు కేసీఆర్ స్పీచ్పై, పార్టీ వేడుకలపై ఉంది.