Apsara Murder Case: అప్సర హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి జీవిత ఖైదు

Apsara Murder Case: హైదరాబాద్ సరూర్నగర్లో యువతి అప్సర హత్య కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు సాయి కృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. సాక్షాలు తారుమారు చేసినందుకు మరో ఏడేళ్లు అదనపు జైలు శిక్ష విధించింది. అప్సరను నాలుగేళ్ల పాటు ప్రేమ కలాపాలు జరిపాడు సాయి కృష్ణ. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
అయితే పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు. శంషాబాద్లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి మ్యాన్హోల్లో పడేశాడు.ఈ కేసులో రెండు వేర్వేరు అంశాలపై విచారణ సాగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఎట్టకేలకు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
రంగారెడ్డి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రస్తుతం సాయి హైకోర్టును ఆశ్రయిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రంగారెడ్డి కోర్టు ఇటీవల కాలంలో సంచలనమైన కేసుల్లో జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిస్తోంది. ఈ కేసుతో కలిపి మొత్తం మూడు కేసుల్లో నిందితులకు కోర్టు జీవిత ఖైదును విధించింది. టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సాక్షుల స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకుని అప్సర హత్య కేసులో సాయికృష్ణకు శిక్షను ఖరారు చేసింది రంగారెడ్డి కోర్టు.