Chandrababu: తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసింది

Chandrababu: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో పలువురు భక్తులు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది అని సీఎం చంద్రబాబు అన్నారు. టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది.
మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందన్న సమాచారం నేపథ్యంలో, ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని… క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని ఆదేశించాను. జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని తెలుసుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు అన్నారు.
Rahul Gandhi: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. బాధితులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
Harish Rao: తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం.. దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. మరణించిన భక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Revanth Reddy: తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటనపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
KTR: తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
Raja Singh: తిరుపతి ఘటన దురదృష్టకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఘటనపై ప్రభుత్వంపై విచారణ జరపాలని,.. మృతుల కుటంబాలకు 10 లక్షల రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్.