America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు

America: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ ఈ ఘటనను ధ్రువీకరించారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడి, ఇంజినీరింగ్ భవనం నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అధికారులు సురక్షితమని ప్రకటించే వరకు బయటకు రావద్దని మేయర్ విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటన గురించి అధికారులు తనకు వివరించారని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తూ, దర్యాప్తులో ఎఫ్బీఐ సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



