కాసేపట్లో ట్రంప్తో భేటీ కానున్న పాక్ ప్రధాని షరీఫ్

పాకిస్తాన్ ఫుల్ స్వింగ్లో ముందుకు సాగుతోంది. సంబంధం లేని విషయాల్లో పై చేయి సాధించామని ఆనందపడటంతోపాటుగా, ప్రపంచానికి ఇప్పుడు తామెంతో కీలకమన్న భావనలో ఆ దేశముంది. ఇరాన్ చర్చల తర్వాత సౌదీ, ఇక చైనాతో ముచ్చట్లు, ఇప్పుడు ఏకంగా అమెరికాతో పాక్ ప్రధాని చర్చలు మొత్తంగా సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్తో ఓవల్ ఆఫీస్లో ప్రైవేట్ భేటీలో పాల్గొననున్నారు. వైట్ హౌస్ షెడ్యూల్ ప్రకారం, ఇది రెండు దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన సమావేశం.
షరీఫ్ న్యూయార్క్లో జరిగే 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని వాషింగ్టన్ చేరుకుంటారు. ట్రంప్ పాలనలో ఇటీవల అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు వేడెక్కాయి. ఆసియాలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అనేక సంవత్సరాలుగా భారతదేశంపై ఆధారపడింది. అయినప్పటికీ, భారతీయులకు వీసా సమస్యలు పెంచి, 50 శాతం టారిఫ్స్ విధించి కక్ష సాధిస్తోంది అగ్రరాజ్యం. మే నెలలో జరిగిన భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ సమయంలో తానే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ చెబితే అంత సీన్ లేదని ఇండియా కుండబద్ధలుకొట్టడంతో ఆయన అహం దెబ్బతింది.
ఇరుదేశాల సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో, ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ను వైట్ హౌస్లో స్వాగతించడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ సైన్యాధిపతిని ఆహ్వానించడం ఇదే మొదటిసారి. భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడంలో ట్రంప్ చేసిన ప్రయత్నాలకు పాకిస్తాన్ మద్దతు తెలిపింది. అయితే ఇస్లామాబాద్, అమెరికా మిత్రదేశాలైన ఇజ్రాయెల్, ఖతార్, ఇరాన్లో జరిగిన బాంబు దాడులను ఖండించింది.
అలాగే, జూలై 31న వాషింగ్టన్లో 19% సుంకంతో వాణిజ్య ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య కుదిరడం కొత్త చర్చకు కారణమైంది. మంగళవారం, ట్రంప్, షరీఫ్, ఇతర ఎనిమిది ఇస్లామిక్-అరబ్ దేశాల నేతల మధ్య జరిగిన సమావేశం తర్వాత, షరీఫ్ ట్రంప్తో అనధికారికంగా 36 సెకండ్ల పాటు భేటీ అయ్యారు. ఆర్థిక, వాణిజ్య, ఉగ్రవాద సమస్యలపై సమస్యల పరిష్కారానికి అధ్యక్షుడు పాకిస్తాన్ నాయకులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నారన్నారని వైట్ హౌస్ పేర్కొంది.



