తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్‌లకు బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి

కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న స్కెచ్ లతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా ?? ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం రిప్లై మరోలా ఉందా?? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని అభివృద్ధి పథకాల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందా?? ఆరోపణలు వచ్చిన వాటిపై ప్రభుత్వం విచారణ చేపడుతూ, వరుస కేసులతో గులాబీ నేతలను అయోమయం చేస్తోందా?? ఎప్పుడు ఏ కేసులో నోటీస్ లు వస్తాయో అని బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందా?? అసలు గులాబీ నేతల పరిస్థితేంటి ? లెట్స్ వాచ్..

10 ఏళ్ళు అధికారంలో ఉండి మరోసారి అధికారంలోకి వస్తామనుకున్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్పీడ్ పెంచింది. ప్రజల్లోకి వెళ్లేందుకు విమర్శలకు పదును పెట్టింది. అయితే బిఆర్ఎస్ నేతల దూకుడుకు విచారణలు, కేసులతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ నేతలు వైఫల్యాలపై మాట్లాడటంతో పాటు వాయిస్ పెంచడంలో ప్రభుత్వం సైతం అదే స్థాయిలో దూకుడు పెంచుతుంది అనే చర్చ సాగుతుంది. పార్టీలోని కీలక నేతల నుంచి కింది స్థాయి నాయకుల వరకు ఎవరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వదలడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా.. మాట్లాడినా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనే 14 పైగా కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల్లో కీలకంగా ఫార్మూలా ఈకారు రేసు కేసు. నిధులు దారి మళ్లీంచారనే అభియోగంతో ఏసీబీ విచారణ చేపడుతోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు పైనా 10వరకు అక్రమ కేసులు నమోదు అయ్యాయి.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై 29కి పైగా కేసులు, బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై 15 కేసులు, డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ పై 25 కేసులు, ఇక బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా సైనికులపై ఎక్కడో ఒకచోట రోజుకో కేసు నమోదవుతూనే ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు కాళేశ్వరం విచారణ పేరుతో కాళేశ్వరం కమిషన్ సైతం గులాబీ అధినేత కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు సైతం నోటీసు ఇచ్చి విచారణ చేపట్టింది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇదే విచారణను సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శిస్తున్న బిఆర్ఎస్ నేతల విచారణకు బిజెపి నేతలు చేస్తున్న డిమాండ్‌తో బిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగిస్తే గులాబి బాస్ కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కాళేశ్వరం విచారణ సిబిఐకి అప్పగిస్తారా అనే చర్చ గులాబీ పార్టీ శ్రేణుల్లో మొదలైంది..

ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణలో అవినీతి, మనీ లాండరింగ్ జరిగిందంటూ కేటీఆర్ ని A1 గా చేర్చుతూ ఏసిబి, ఈడి FIR నమోదు చేసింది. విచారణకు హాజరుకావాలని కేటీఆర్ కు నోటీసులు జారీచేశారు. ఏసిబి ముందు రెండు సార్లు, ఈడి ముందుకు ఒకసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్ సుదీర్ఘ విచారణ సైతం ఎదుర్కొన్నారు. మూడు సార్లు కాదు కదా 30 సార్లు విచారణకు పిలిచినా ఎటువంటి విచారణకు అయిన హాజరు అవుతానని కేటీఆర్ తెలిపారు. తాను 2001 నుండి 2024 వరకు వాడిన ముబైల్ ని ఇవ్వాలంటూ ఏసీబీ కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది.

మొబైల్ ఇవ్వాలంటూ ఏసీబీ ఇచ్చిన నోటీస్ లకు రిప్లై ఇచ్చారు కేటీఆర్. తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఏసీబీ ప్రవర్తిస్తుందంటూ రిప్లై ఇచ్చారు కేటీఆర్. ఏసీబీ రెండు సార్లు కేటీఆర్ ను విచారణకు పిలిచిన నేపధ్యంలో ఈడీ కూడా మరోసారి విచారణకు పిలుస్తుందని బీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. అదును చూసుకుని ఈడీ కేటీఆర్ కు విచారణకు రావాలంటూ నోటీస్ లు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగానే సాగుతోంది.

ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక ఘట్టానికి చేరుకుంది. A1 ప్రభాకర్ రావుతో సహా A6 గా ఉన్న శ్రవణ్ వరకూ అందరినీ సిట్ ఇప్పటికే విచారించింది. ఈ కేసులో నెక్స్ట్ బిఆర్ఎస్ నేతలకు సిట్ నోటీసులు పంపుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ క్షణమైనా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు రావచ్చనే చర్చ బిఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖతో పాటు బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ కేటీఆర్ పైన బహిరంగంగా విమర్శలు కూడా చేస్తున్నారు.

ఇప్పటికే ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణలను ఎదుర్కొంటున్న కేటీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు వేస్తే మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంటుందని పార్టీ కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. వివిధ కేసుల్లో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు విచారించి అరెస్టు చేశారు. బంజారాహిల్స్, కరీంనగర్, వరంగల్ లో ఆయన పై కేసులు నమోదు అయ్యాయి. అయితే రిమాండ్ విధించిన కొన్ని గంటల్లోనే కౌశిక్ రెడ్డికి మూడు కేసుల్లో బెయిల్ లభించింది.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందర్నీ వేధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతున్నదని ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తుచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలను తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కేసులతో, విచారణలతో ప్రజల్లోకి తీసుకెళ్తాం అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న విమర్శలు, ఆరోపణలు ఎంతవరకు దారి తీస్తాయో బిఆర్ఎస్ నేతలకు మరిన్ని నోటీసులు వస్తాయానేది వేచి చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button