KCR: మాగంటి గోపినాథ్ మరణం పార్టీకి తీరని లోటు

హైదరాబాద్ మాదాపూర్లోని నివాసానికి మాగంటి గోపినాథ్ భౌతికకాయం తరలించారు. మాగంటి గోపినాథ్ చివరి చూపు కోసం ఆయన అభిమానులు భారీగా చేరుకుంటారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు. మాగంటి కుటుంబం, అభిమానులకు కేసీఆ ర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాగంటి గోపీనాథ్ మృతిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. గోపీనాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటు అన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల తలలో నాలుకగా ఉండేవారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి.
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్లో చేరారు.
ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగానూ మాగంటి గోపీనాథ్ పనిచేశారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉదయం 5గంటల 45నిమిషాలకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కన్నుముశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఏఐజీలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా మాగంటి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం.